4/17/09

బొబ్బట్లు


కావలసిన పదార్ధాలు :
శనగ పప్పు : అర కిలో
బెల్లం: అర కిలో
మైదా : అర కిలో
యాలకులు : అయిదు లేక ఆరు
నెయ్యి : బొబ్బట్లు కాల్చుకోడానికి తగినంత
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం :
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి.
మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా బొబ్బట్లు వస్తాయి.


ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి.

పప్పు చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.

రుబ్బిన పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .

ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి మద్యలో పెట్టాలి.

ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి.


ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.

అలా వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.

మిగిలిన పూర్ణం కూడా పైన చేసిన విధంగా చేసుకోవాలి.
బొబ్బట్లు రెడీ అయినట్టే మరి .......



రంగోలి రోటి



కావలసిన పదార్ధాలు :

మైదా : అర కిలో
పాలకూర : మూడు కట్టలు
టమాటాలు : నాలుగు పెద్దవి
పచ్చి మిర్చి : నాలుగు
జీలకర్ర పొడి : ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూను
కారం: అర టీ స్పూను
ఉప్పు : రుచికి తగినంత
నూనె : మూడు టబుల్ స్పూన్లు

తయారు చేసే విధానము:

ముందుగా పాలకూర ఆకులు తీసుకొని బాగా కడుగుకోవాలి. ఒక గిన్నెలో నీరు పోసి అందులో పాలకూర వేసి ఉడికించుకోవాలి. పాలకూర ఉడికాక నీటిలో నుండి తీసేసి చల్లార నివ్వాలి. ఇప్పుడు మిక్సీ జారులో పాలకూర , పచ్చిమిర్చి , జీలకర్ర పొడి మరియు సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పాలకూర్ ముద్దను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు టమాటాలను తీసుకొని మళ్ళీ వేడి నీటిలో వేసి పాలకూరని ఉదికిన్చినట్టే ఉడికించాలి. టమాటాలు ఉడికాక నీటి నుండి తీసి చల్లార బెట్టాలి. చల్లారాక టమాటాకి ఉన్న తొక్కని తీసెయ్యాలి. ఆ టమాటాలను మిక్సీ లో వేసి కొంచెం కారం , అల్లం వెల్లుల్లి ముద్ద మరియు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో సగం మైదా పిండి అంటే పావు కిలో తీసుకొని అందులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర ముద్దని వేసి అవసరం అనుకుంటే కొంచెం నీరు పోసి రెండు టీ స్పూన్ల నూనె వేసి చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. అలా తయారు అయిన పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

మిగిలిన మైదా పిండిలో మనం తయారుగా పెట్టుకున్న టమాటా ముద్దను కలిపి కొంచెం నూనె కొంచెం నీరు పోసి మళ్ళీ ఇందాకటి లాగే చపాతీ పిండిలాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒకొక్క పిండి ముద్దను తీసుకొని విడివిడిగా పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి .

కొంచెం మందంగా వత్తుకోవాలి. ఆకుపచ్చ చపాతీ మీద ఎర్ర చపాతీ పెట్టి రెండు కలిపి ఆ ముక్కలను. తరువాత చాకుతో అడ్డంగా ముక్కలుగా కోసుకోవాలి.
నిలువుగా ఉన్నా ముక్కను అడ్డంగా తిప్పితే ఇలా ఉంటుంది.

ఒకొక్క ముక్కను తీసుకొని చపాతీ లాగ వత్తుకోవాలి.

అంతే రంగోలి రోటి రెడీ.....మీకు నచ్చిన కూరతో కలిపి లాగించేయ్యడమే మరి .....
నేను ఈ వంటకాన్ని ఈనాడు ఆదివారం పుస్తకంలో చూసి ట్రై చేశాను బాగా కుదిరాయి....మీరు కూడా ట్రై చెయ్యండి మరి.....

4/15/09

సేమ్యా ఉప్మా



కావలసిన పదార్ధాలు:

సేమ్యా : అర కిలో
బంగాళా దుంపలు ( ఆలు) : రెండు , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు : ఒకటి పెద్దది , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి
పల్లీలు : గుప్పెడు
పచ్చిమిర్చి: మూడు
కరివేపాకు: ఒక రెబ్బ
పోపు సామాను: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు
నూనె: మూడు టబుల్ స్పూన్లు
నీరు : లీటరు
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేసే విధానము :
ముందుగా గాస్ మీద ఒక బాణీ పెట్టి అది వేడి అయ్యాక అందులో ఒక టబుల్ స్పూన్ నూనె పోసి నూనె కాగాక అందులో సేమ్యా వేసి కొంచెం వేయించుకోవాలి ( పచ్చి వాసన రాకుండా కొంచెం వేయించాలి, అంతే ) . సేమ్యా బంగారు రంగు రాకుండానే దింపెయ్యాలి. అలా వేయించిన సేమ్యా ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ గాస్ మీద బాణీ పెట్టుకొని బాణీ కాగాక అందులో రెండు టబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, పల్లీలు, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేగ నివ్వాలి. ఇప్పుడు అందులో బంగాల దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి.

ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక లీటరు నీరు పోసుకోవాలి. ఒక గ్లాసు సేమ్యకి రెండు గ్లాసుల నీళ్లు అన్నమాట. నీరు పోసాక బాణీ పై మూత పెట్టి నీరు మరగానివ్వాలి.

నీరు మరుగుతూ ఉండగా అందులో ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యా ని ఆ నీటిలో వేసి బాగా కలిపి గాస్ మంట తగ్గించి మళ్ళీ మూత పెట్టెయ్యాలి. మద్య మద్య లో మూత తీసి కదుపుతూ ఉండాలి. నీళ్లు అన్ని ఇగిరి సేమ్యా ఉడికాక ఇంక గాస్ కట్టేయ్యాలి.

వేడి వేడి సేమ్యా ఉప్మా రెడీ.....