10/14/09

వెజిటబుల్ పులావ్


కావలసిన పదార్ధాలు:
బియ్యం : అర కిలో
కారెట్ : నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బీన్సు: వంద గ్రాములు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బంగాళా దుంపలు లేదా ఆలూ: నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
ఉల్లిపాయలు : అయిదు ఆరు ( పొడుగ్గా చీలికలు చేసుకోవాలి)
కాలిఫ్లవర్: ఒక చిన్న పువ్వు ( కావాలంటే వేసుకోవచ్చు )
పచ్చి బఠాణీ : ఒక కప్ ( నాన బెట్టినవి, లేదా తాజావి )
లవంగాలు: అయిదు ఆరు
యాలకులు : అయిదు ఆరు
దాల్చిన చెక్క : అయిదు ఆరు చిన్న ముక్కలు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు
నూనె , నేయ్యి లేదా డాల్డా : తగినంత
పచ్చిమిర్చి: అయిదు ఆరు( చీలికలు చేసుకోవాలి)
ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు ( కావలిస్తే వేసుకోవచ్చు )
కారం: ఒక స్పూను ( కారం ఇష్ట పడేవాళ్ళు వేసుకోవచ్చు )
పసుపు: చిటికెడు ( రంగు కోసం )
ఉప్పు : రుచికి తగినంత
నీరు: ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు
కొత్తిమీర: ఒక కట్ట
పుదినా : అర కట్ట ( తినేవారు వేసుకోవచ్చు)
జీడిపప్పు: పది పదిహేను ( కావాలంటే వేసుకోవచ్చు)
బిర్యాని ఆకు : రెండు మూడు

తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.

ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.

ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.

ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి. వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.

అవి కొంచెం వేగ నివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
కుక్కర్ ఐతే మూడు కూతలు రాగానే కట్టేయ్యాలి. గిన్నెలో ఐతే అన్నం ఉడికాక గ్యాసు కట్టేయ్యాలి.
పులావ్ తో పాటు ఉల్లిపాయ రైతా చేసుకుంటే బాగుంటుంది.

కాజాలు లేదా చెక్కర బాణాలు


మా ఇంట్లో వీటిని కాజాలని అంటాము. మా అత్తారింట్లో వీటిని చెక్కర బాణాలని అంటారు. కాబట్టి రెండు రాసాను. ఇవి కాకినాడ కాజా మరియు మడత కాజా లాగా కాకుండా చాల సులువుగా చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు :
మైదా పిండి : అర కిలో
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి తగినంత
బెల్లం లేదా పంచదార: అర కిలో

తయారు చేసే విధానం:
వీటిని పాకం పట్టుకోవచ్చు లేదా ఉప్పు కారం వేసి కమ్మగా చేసుకోవచ్చు. స్వీటు హాటు కూడా చేసుకోవచ్చన్నమాట. ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కమ్మటి వాటికైతే ఉప్పు కలపాలి, తీపి వాటికి అక్కరలేదు. మైదా పిండిలో కొంచెం ( నాలుగు అయిదు స్పూన్లు) కాచిన నూనె కలుపుకోవాలి. అప్పుడు కాజాలు గుల్లగా వస్తాయి. తరువాత తగినన్ని నీరు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలు చేసి పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి.

ఆ చపాతీని ముందు నిలువుగా తరువాత అడ్డంగా చాకుతో కోసుకోవాలి డైమెండ్ ఆకారం లో .

ఇప్పుడు అలా కోసిన వాటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వత్తి , కోసి వేయించుకోవాలి. కమ్మటివి కావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం ఆ కాజాల మీద చల్లుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకోవచ్చు. తియ్యటివి కావాలనుకుంటే పంచదార లేదా బెల్లం ముదురు పాకం పట్టి అందులో వేయించిన కాజాలు వేసి బాగా కలుపుకోవాలి , పాకం అన్ని కాజాలకి పట్టేలాగా . చల్లారిన తరువాత ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి.

పప్పు చెక్కలు


కావలసిన పదార్ధాలు :
వరిపిండి : అర కిలో
నీరు : అర లీటరు
శనగపప్పు : యాభై గ్రాములు ( రెండు గుప్పెళ్ళు సుమారు), రెండు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి
కారం : రెండు స్పూన్లు లేదా పచ్చిమిర్చి పేస్టు : రెండు స్పూన్లు
కరివేపాకు: రెండు మూడు రెబ్బలు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి సరిపడా

తయారు
చేసే విధానం:

ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టుకొని అందులో నీరు పోసుకోవాలి. నీరు బాగా మరిగాక అందులో సెనగపప్పు, కారం , ఉప్పు, చిన్న చిన్నగా తుంపిన కరివేపాకు మరియు వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. గ్యాసు ఆపేసి తయారైన మిశ్రమాన్ని బాగా చల్లారా నివ్వాలి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలాగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కాని పల్చగా వత్తుకోవాలి.


అలా
వత్తిన వాటిని బాగా కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి . ఇలాగే మిగిలిన పిండితో కూడా చెక్కలు వత్తుకొని వేయించుకోవాలి. చల్లారిన చక్కలను ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవచ్చు.

దోస ఆవకాయ


కావలసిన పదార్ధాలు :
దోసకాయలు : అర కిలో
ఆవపిండి : ముప్పై గ్రాములు సుమారు
ఉప్పు : నలభై గ్రాములు సుమారు
కారం : యాభై గ్రాములు సుమారు
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం:

ముందుగా దోసకాయను తీసుకొని సగానికి తరిగి అందులో గింజలు తీసి వేసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

దోసకాయ చెక్కు తియ్యకూడదు . ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో దోసకాయ ముక్కలు , ఆవపిండి, కారం, ఉప్పు మరియు నూనె వేసి బాగా కలుపుకోవాలి.

ఉప్పు రుచిని బట్టి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలా అన్నీ బాగా కలిపిన తరువాత మూత పెట్టి ఊరనివ్వాలి. ఒక రోజు ఊరితే కారం , ఉప్పు మరియు ఆవపిండి ముక్కలకి బాగా పడుతుంది. మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం నూనె కలుపుకోవచ్చు. అలా ఊరిన దోస ఆవకాయిని ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవాలి. ఇది మూడు నాలుగు వారాలదాకా నిలువ ఉంటుంది.

వేరుసెనగపప్పు చిక్కి


కావలసిన పదార్ధాలు:

వేరుసెనగపప్పు లేదా పల్లీలు - అర కిలో
బెల్లం - అర కిలో ( తరుగుకోవాలి )
గుల్ల సెనగపప్పు లేదా పుట్నాలు - రెండు మూడు స్పూన్లు
నీరు

తయారు చేసే విధానం:
ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టి వేరుసెనగపప్పుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణీ కానీ మందంగా ఉన్న గిన్నె గాని తీసుకొని అందులో తరిగిన బెల్లం వేసి బెల్లం మునిగేదాక నీరు పోసి గ్యాస్ మీద పెట్టి ముదురు పాకం పట్టుకోవాలి.

ఒక ప్లేట్ లో కొంచెం నీరు పోసి బెల్లం పాకం అవుతుండగా కొంచెం తీసి నీళ్ళలో వేసి అది ఉండ అవుతుంటే ముదురు పాకం వచ్చినట్టే. పాకం వచ్చాక అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు , పుట్నాలు వేసి బాగా కలపాలి.


ఇప్పుడు ఒక కంచం కాని ప్లేట్ గాని తీసుకొని గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి పోసి ప్లేట్ అంతా సమానంగా పరచాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసి డబ్బాలో పెట్టుకోవాలి.

7/17/09

సగ్గుబియ్యం వడలు


కావలసిన పదార్ధాలు:

సగ్గుబియ్యం : పావు కిలో
బంగాళా దుంపలు: మూడు
పచ్చిమిర్చి : అయిదు లేక ఆరు
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెబ్బలు
జీలకర్ర: ఒక చెంచా
వేరుశనగ పప్పు లేదా పల్లీలు : రెండు గుప్పెళ్ళు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించటానికి సరిపడా

తయారు చేసే విధానం:
ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. బంగాలదుంపలు చెక్కు తీసి ఉడకబెట్టుకోవాలి. ఉడికినవాటిని మెత్తటి ముద్దలాచేసి పక్కన పెట్టుకోవాలి. వేరుసెనగపప్పు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
సగ్గుబియ్యం నానాకా నీళ్లు ఏమైనా మిగిలితే తీసెయ్యాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.అందులో ఇందాక మనం ముద్ద చేసిపెట్టుకున్న బంగాళా దుంపల మిశ్రమాన్ని కలపాలి. అలాగే వేరుసెనగపప్పుపొడిని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర మరియు ఉప్పు వేసిఅన్నిటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాణీ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసికాగనివ్వాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కాని అరటి ఆకు కాని తీసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని వడలాగా వత్తుకోవాలి.

వడని కాగుతున్న నూనెలోవేసి దోరగా వేయించుకోవాలి.

ఎంతో
రుచిగా కరకరలాడే సగ్గుబియ్యం వడలు తయారు అయినట్టే.

నేను ఈవంటకాన్ని ఈనాడు పేపర్లో చూసి ట్రైచేశాను...చాల బాగా వచ్చాయి....మీరూ తప్పక ట్రై చెయ్యండి మరి....వానాకాలం లో సాయంకాలం పూట వడలు చేసుకుంటే చాల బాగుంటుంది కదా....??
















7/15/09

పనీర్ టిక్కా



కావలసిన పదార్ధాలు:


పనీర్ : రెండు వందల గ్రాములు
క్యాప్సికం : రెండు
ఉల్లిపాయలు : రెండు
టమాటాలు : రెండు
పెరుగు: యాభై గ్రాములు ( ఐదు లేక ఆరు స్పూన్లు )
ధనియాల పొడి : ఒక స్పూను
జీలకర్ర పొడి : ఒక స్పూను
కారం: అర స్పూను
తందూరీ మసాల: ఒక స్పూను
చాట్ మసాల: ఒక స్పూను
ఉప్పు: రుచికి తగినంత
కసూరి మేథి: అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక స్పూను

తయారు చేసే విధానము:

ముందుగా పనీర్, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు( బాగా గట్టిగా ఉండి, నీరు లేకుండా చూసుకోవాలి) , అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి , జీలకర్ర పొడి, కారం, చాట్ మసాల, తందూరీ మసాల, కారం, ఉప్పు మరియు కసూరి మేథి వేసుకోవాలి. అన్ని బాగా కలుపుకోవాలి . ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న, పనీర్, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమాటాలను వేసుకొని, మసాల అంతా అన్ని ముక్కలకి పట్టేలగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్ ని రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

ఇప్పుడు ఫ్రిజ్ లోనుండి బౌల్ తీసి అన్ని ముక్కలను పెనం మీద కాని, ఓవెన్ లో కాని, లేక పోతే కుంపటి లో కాని దోరగా కాల్చుకోవాలి. లేదా నూనెలో వేసి వేయించుకోవాలి. నేను వాటిని కుంపటిలో కాల్చాను.


అలా చెయ్యాలి అంటే ఒక పుల్ల కాని సన్నని ఊచ లాంటిది కాని తీసుకొని ఒక పనీర్ ముక్క, ఒక క్యాప్సికం ముక్క, ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమాటా ముక్క అలా ఒక దాని తరువాత ఒకటి ఊచకి గుచ్చి కుంపటి మీద పెట్టి కాల్చుకోవాలి.


ఎంతో రుచిగా ఉండే పనీర్ టిక్కా రెడీ అయినట్టే....అదీ హోటల్ లో చేసినట్టే....ట్రై చెయ్యండి మరి....

4/17/09

బొబ్బట్లు


కావలసిన పదార్ధాలు :
శనగ పప్పు : అర కిలో
బెల్లం: అర కిలో
మైదా : అర కిలో
యాలకులు : అయిదు లేక ఆరు
నెయ్యి : బొబ్బట్లు కాల్చుకోడానికి తగినంత
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం :
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి.
మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా బొబ్బట్లు వస్తాయి.


ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి.

పప్పు చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.

రుబ్బిన పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .

ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి మద్యలో పెట్టాలి.

ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి.


ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.

అలా వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.

మిగిలిన పూర్ణం కూడా పైన చేసిన విధంగా చేసుకోవాలి.
బొబ్బట్లు రెడీ అయినట్టే మరి .......



రంగోలి రోటి



కావలసిన పదార్ధాలు :

మైదా : అర కిలో
పాలకూర : మూడు కట్టలు
టమాటాలు : నాలుగు పెద్దవి
పచ్చి మిర్చి : నాలుగు
జీలకర్ర పొడి : ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూను
కారం: అర టీ స్పూను
ఉప్పు : రుచికి తగినంత
నూనె : మూడు టబుల్ స్పూన్లు

తయారు చేసే విధానము:

ముందుగా పాలకూర ఆకులు తీసుకొని బాగా కడుగుకోవాలి. ఒక గిన్నెలో నీరు పోసి అందులో పాలకూర వేసి ఉడికించుకోవాలి. పాలకూర ఉడికాక నీటిలో నుండి తీసేసి చల్లార నివ్వాలి. ఇప్పుడు మిక్సీ జారులో పాలకూర , పచ్చిమిర్చి , జీలకర్ర పొడి మరియు సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పాలకూర్ ముద్దను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు టమాటాలను తీసుకొని మళ్ళీ వేడి నీటిలో వేసి పాలకూరని ఉదికిన్చినట్టే ఉడికించాలి. టమాటాలు ఉడికాక నీటి నుండి తీసి చల్లార బెట్టాలి. చల్లారాక టమాటాకి ఉన్న తొక్కని తీసెయ్యాలి. ఆ టమాటాలను మిక్సీ లో వేసి కొంచెం కారం , అల్లం వెల్లుల్లి ముద్ద మరియు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో సగం మైదా పిండి అంటే పావు కిలో తీసుకొని అందులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర ముద్దని వేసి అవసరం అనుకుంటే కొంచెం నీరు పోసి రెండు టీ స్పూన్ల నూనె వేసి చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. అలా తయారు అయిన పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

మిగిలిన మైదా పిండిలో మనం తయారుగా పెట్టుకున్న టమాటా ముద్దను కలిపి కొంచెం నూనె కొంచెం నీరు పోసి మళ్ళీ ఇందాకటి లాగే చపాతీ పిండిలాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒకొక్క పిండి ముద్దను తీసుకొని విడివిడిగా పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి .

కొంచెం మందంగా వత్తుకోవాలి. ఆకుపచ్చ చపాతీ మీద ఎర్ర చపాతీ పెట్టి రెండు కలిపి ఆ ముక్కలను. తరువాత చాకుతో అడ్డంగా ముక్కలుగా కోసుకోవాలి.
నిలువుగా ఉన్నా ముక్కను అడ్డంగా తిప్పితే ఇలా ఉంటుంది.

ఒకొక్క ముక్కను తీసుకొని చపాతీ లాగ వత్తుకోవాలి.

అంతే రంగోలి రోటి రెడీ.....మీకు నచ్చిన కూరతో కలిపి లాగించేయ్యడమే మరి .....
నేను ఈ వంటకాన్ని ఈనాడు ఆదివారం పుస్తకంలో చూసి ట్రై చేశాను బాగా కుదిరాయి....మీరు కూడా ట్రై చెయ్యండి మరి.....