7/17/09

సగ్గుబియ్యం వడలు


కావలసిన పదార్ధాలు:

సగ్గుబియ్యం : పావు కిలో
బంగాళా దుంపలు: మూడు
పచ్చిమిర్చి : అయిదు లేక ఆరు
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెబ్బలు
జీలకర్ర: ఒక చెంచా
వేరుశనగ పప్పు లేదా పల్లీలు : రెండు గుప్పెళ్ళు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించటానికి సరిపడా

తయారు చేసే విధానం:
ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. బంగాలదుంపలు చెక్కు తీసి ఉడకబెట్టుకోవాలి. ఉడికినవాటిని మెత్తటి ముద్దలాచేసి పక్కన పెట్టుకోవాలి. వేరుసెనగపప్పు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
సగ్గుబియ్యం నానాకా నీళ్లు ఏమైనా మిగిలితే తీసెయ్యాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.అందులో ఇందాక మనం ముద్ద చేసిపెట్టుకున్న బంగాళా దుంపల మిశ్రమాన్ని కలపాలి. అలాగే వేరుసెనగపప్పుపొడిని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర మరియు ఉప్పు వేసిఅన్నిటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాణీ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసికాగనివ్వాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కాని అరటి ఆకు కాని తీసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని వడలాగా వత్తుకోవాలి.

వడని కాగుతున్న నూనెలోవేసి దోరగా వేయించుకోవాలి.

ఎంతో
రుచిగా కరకరలాడే సగ్గుబియ్యం వడలు తయారు అయినట్టే.

నేను ఈవంటకాన్ని ఈనాడు పేపర్లో చూసి ట్రైచేశాను...చాల బాగా వచ్చాయి....మీరూ తప్పక ట్రై చెయ్యండి మరి....వానాకాలం లో సాయంకాలం పూట వడలు చేసుకుంటే చాల బాగుంటుంది కదా....??
















7/15/09

పనీర్ టిక్కా



కావలసిన పదార్ధాలు:


పనీర్ : రెండు వందల గ్రాములు
క్యాప్సికం : రెండు
ఉల్లిపాయలు : రెండు
టమాటాలు : రెండు
పెరుగు: యాభై గ్రాములు ( ఐదు లేక ఆరు స్పూన్లు )
ధనియాల పొడి : ఒక స్పూను
జీలకర్ర పొడి : ఒక స్పూను
కారం: అర స్పూను
తందూరీ మసాల: ఒక స్పూను
చాట్ మసాల: ఒక స్పూను
ఉప్పు: రుచికి తగినంత
కసూరి మేథి: అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక స్పూను

తయారు చేసే విధానము:

ముందుగా పనీర్, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు( బాగా గట్టిగా ఉండి, నీరు లేకుండా చూసుకోవాలి) , అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి , జీలకర్ర పొడి, కారం, చాట్ మసాల, తందూరీ మసాల, కారం, ఉప్పు మరియు కసూరి మేథి వేసుకోవాలి. అన్ని బాగా కలుపుకోవాలి . ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న, పనీర్, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమాటాలను వేసుకొని, మసాల అంతా అన్ని ముక్కలకి పట్టేలగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్ ని రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

ఇప్పుడు ఫ్రిజ్ లోనుండి బౌల్ తీసి అన్ని ముక్కలను పెనం మీద కాని, ఓవెన్ లో కాని, లేక పోతే కుంపటి లో కాని దోరగా కాల్చుకోవాలి. లేదా నూనెలో వేసి వేయించుకోవాలి. నేను వాటిని కుంపటిలో కాల్చాను.


అలా చెయ్యాలి అంటే ఒక పుల్ల కాని సన్నని ఊచ లాంటిది కాని తీసుకొని ఒక పనీర్ ముక్క, ఒక క్యాప్సికం ముక్క, ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమాటా ముక్క అలా ఒక దాని తరువాత ఒకటి ఊచకి గుచ్చి కుంపటి మీద పెట్టి కాల్చుకోవాలి.


ఎంతో రుచిగా ఉండే పనీర్ టిక్కా రెడీ అయినట్టే....అదీ హోటల్ లో చేసినట్టే....ట్రై చెయ్యండి మరి....