
కావలసిన పదార్ధాలు:
సేమ్యా : అర కిలో
బంగాళా దుంపలు ( ఆలు) : రెండు , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు : ఒకటి పెద్దది , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి
పల్లీలు : గుప్పెడు
పచ్చిమిర్చి: మూడు
కరివేపాకు: ఒక రెబ్బ
పోపు సామాను: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు
నూనె: మూడు టబుల్ స్పూన్లు
నీరు : లీటరు
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేసే విధానము :
ముందుగా గాస్ మీద ఒక బాణీ పెట్టి అది వేడి అయ్యాక అందులో ఒక టబుల్ స్పూన్ నూనె పోసి నూనె కాగాక అందులో సేమ్యా వేసి కొంచెం వేయించుకోవాలి ( పచ్చి వాసన రాకుండా కొంచెం వేయించాలి, అంతే ) . సేమ్యా బంగారు రంగు రాకుండానే దింపెయ్యాలి. అలా వేయించిన సేమ్యా ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ గాస్ మీద బాణీ పెట్టుకొని బాణీ కాగాక అందులో రెండు టబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, పల్లీలు, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేగ నివ్వాలి. ఇప్పుడు అందులో బంగాల దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి.

ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక లీటరు నీరు పోసుకోవాలి. ఒక గ్లాసు సేమ్యకి రెండు గ్లాసుల నీళ్లు అన్నమాట. నీరు పోసాక బాణీ పై మూత పెట్టి నీరు మరగానివ్వాలి.

నీరు మరుగుతూ ఉండగా అందులో ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యా ని ఆ నీటిలో వేసి బాగా కలిపి గాస్ మంట తగ్గించి మళ్ళీ మూత పెట్టెయ్యాలి. మద్య మద్య లో మూత తీసి కదుపుతూ ఉండాలి. నీళ్లు అన్ని ఇగిరి సేమ్యా ఉడికాక ఇంక గాస్ కట్టేయ్యాలి.
వేడి వేడి సేమ్యా ఉప్మా రెడీ.....